Rah-Veer Scheme Road Accident Reward | రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆదుకునే విషయంలో ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి, వారిని ‘ప్రాణదాతలు’గా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘రహ-వీర్’ (Rah-Veer) పథకాన్ని అమలు చేస్తున్నాయి.
దీనిపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సామాజిక మాధ్యమాల వేదికగా ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే (గోల్డెన్ అవర్ లో) బాధితులను ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం రూ. 25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తుంది.
ఏడాది పొడవునా అత్యుత్తమ సేవలు అందించిన వారిలో జాతీయ స్థాయిలో ఎంపికైన 10 మందికి రూ. 1,00,000 లక్ష ప్రత్యేక పురస్కారం లభిస్తుంది.
సాయం చేసిన వారిని పోలీసులు సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేయరు. వారి వ్యక్తిగత వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని అంతకంటే లేదు. సాయం చేసే పౌరులకు (Good Samaritans) చట్టం పూర్తి రక్షణ కల్పిస్తోందని సీపీ స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగినప్పుడు సెల్ఫోన్లతో వీడియోలు తీస్తూ సమయాన్ని వృథా చేయవద్దని, ఆ ఒక్క నిమిషం బాధితుడి ప్రాణం కాపాడుతుందని సీపీ కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పిస్తోందని, ప్రతి పౌరుడు ఈ సామాజిక బాధ్యతలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.






