Rahul Gandhi on Women’s Reservation Bill 2026 | లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు పన్నిన కుట్రను ప్రతిపక్షాలు విజయవంతంగా తిప్పికొట్టాయని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం బిల్లుపై ఓటింగ్ అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. “ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు మహిళల ప్రయోజనం కోసం ఉద్దేశించినది కాదు. ఇది ముమ్మాటికీ ఒక ‘యాంటీ నేషనల్ యాక్ట్’ (దేశ వ్యతిరేక చట్టం). మహిళా బిల్లు ముసుగులో రాజ్యాంగ మూలాలను దెబ్బతీయాలని చూశారు” అని రాహుల్ ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తో ముడిపెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి డీలిమిటేషన్ జరగాలనే నిబంధన కేవలం కాలయాపన చేయడానికేనని ఆయన మండిపడ్డారు.
2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఎటువంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. “మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే, ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే 33 శాతం కోటాను అమలు చేయాలి” అని స్పష్టం చేశారు.
రాజ్యాంగ సవరణ పేరుతో ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా నిలబడి అడ్డుకున్నాయని, ఇది ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు.
బిల్లు వీగిపోయినందుకు బీజేపీ విపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’గా చిత్రీకరిస్తుండగా, రాహుల్ గాంధీ మాత్రం ఇది ‘రాజ్యాంగ రక్షణ’ కోసం చేసిన పోరాటమని చెబుతున్నారు.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోకుండా ఉండాలంటే డీలిమిటేషన్ ముడిని తొలగించాలని ఇండీ కూటమి పట్టుబడుతోంది.






