Man protests with almonds | ప్రభుత్వ కార్యాలయాల్లో “ఫైల్ దొరకడం లేదు” అనే సాకుతో సామాన్యులను తిప్పించుకోవడంపై ఓ వ్యక్తి ప్రదర్శించిన నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా హౌసింగ్ బోర్డు కార్యాలయంలో జరిగిన ఈ ఘటన, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై వ్యంగ్యాస్త్రంగా నిలిచింది.
అసలేం జరిగిందంటే.. బాధితుడు తన ఇంటికి సంబంధించిన ఒక ఫైల్ క్లియరెన్స్ కోసం గత కొన్ని నెలలుగా హౌసింగ్ బోర్డు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, అక్కడి మహిళా అధికారిణి ప్రతిసారి “మీ ఫైల్ దొరకడం లేదు.. ఎక్కడ ఉందో గుర్తు రావడం లేదు” అని సమాధానం ఇస్తూ అతన్ని వెనక్కి పంపుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన సదరు వ్యక్తి, ఈసారి నేరుగా ఒక బాదం ప్యాకెట్తో ఆఫీసుకు వెళ్లాడు.
టేబుల్ పై బాదం గింజలు: నేరుగా అధికారిణి చాంబర్లోకి వెళ్లిన ఆయన.. తన జేబులోంచి బాదం పప్పులను తీసి ఆమె టేబుల్ పై పోశాడు. “మేడం! ఇవి తినండి.. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అప్పుడైనా నా ఫైల్ ఎక్కడుందో మీకు గుర్తుకు వస్తుంది” అని అందరి ముందూ నిలదీశాడు. ఆ వ్యక్తి సమాధానానికి సదరు అధికారిణి షాక్ తిని మౌనంగా ఉండిపోయింది.
నెటిజన్ల రియాక్షన్..
ఈ వినూత్న నిరసనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “బాధితుడి ఐడియా అద్భుతం” అని కొందరు అంటుంటే, “ఇలాంటి వాళ్లకు బాదం పప్పులు కాదు, బాధ్యత కావాలి” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా, ఫైళ్ల వేటలో సామాన్యుడి ఆవేదన ఈ వీడియో ద్వారా మరోసారి బహిర్గతమైంది.






