- ప్రతీకారానికి సిద్ధమంటున్న టెహ్రాన్..
US Navy seizes Iranian ship Touska | ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ వంటి హార్మూజ్ జలసంధి సమీపంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
గల్ఫ్ ఆఫ్ ఓమాన్లో ప్రయాణిస్తున్న ఇరాన్ వాణిజ్య నౌక ‘టౌస్కా’ (Touska) ను అమెరికా నేవీ ఆదివారం సీజ్ చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది.
అమెరికా విధించిన నావికా దళ దిగ్బంధాన్ని (Naval Blockade) ఉల్లంఘించి, ఇరాన్కు చెందిన కంటైనర్ షిప్ ‘టౌస్కా’ బందర్ అబ్బాస్ పోర్టు వైపు వెళ్తుండగా యూఎస్ నేవీ అడ్డుకుంది. యూఎస్ డిస్ట్రాయర్ హెచ్చరికలను నౌక సిబ్బంది ఖాతరు చేయకపోవడంతో, అమెరికా మెరైన్లు ఇంజన్ రూమ్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు.
అనంతరం నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు. అమెరికా చర్యను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది పచ్చి ‘సముద్ర పైరసీ’ అని, అంతర్జాతీయ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించిందని మండిపడింది. తమ నౌకను సీజ్ చేసినందుకు త్వరలోనే తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
ఇరాన్-అమెరికా మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ బుధవారంతో ముగియనుంది. ఈ లోపే ఈ ఘటన జరగడం ఉద్రిక్తతలను పెంచింది.
హార్మూజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగి ఉంది. ఇక్కడ అలజడి రేగితే అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది.






