TG Ministers Visit KCR Home | తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉప్పు నిప్పులా మాటల యుద్ధం కొనసాగతున్న వేళ మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఇంటికి తెలంగాణ మహిళా మంత్రులు వెళ్లారు.
అయితే ఇందులో రాజకీయం ఏం లేదు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న మేడారం (Medaram Jatara) సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానిస్తూ మంత్రులు సీతక్క (Seethakka), కొండా సురేఖ (Konda Surekha) ఇద్దరూ కలిసి కేసీఆర్ ఇంటికి వెళ్లారు.
ఎర్రవెల్లి నివాసంలో కలసి ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వాన పత్రికతో పాటు అమ్మవార్ల ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్, శోభమ్మ దంపతులు మంత్రులను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు. తమ ఇంటికి వచ్చిన ఆడపడుల మాదిరిగా సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ ఇచ్చి, చీరలతో సత్కరించారు.
స్వయంగా కేసీఆర్ కూడా మహిళా మంత్రులు ఇద్దరినీ బాగున్నారా అమ్మా అని పలకరించినట్లు తెలుస్తోంది. మేడారం అభివృద్ధి పనుల గురించి కేసీఆర్ అడగగా, దాదాపు రూ. 200 కోట్లతో జాతర పరిసరాలను తీర్చిదిద్దినట్లు మంత్రులు తెలిపారు. ఈ మహా జాతరకు తాము తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తామని కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.










