Pawan Kalyan Social Media Rules | సోషల్ మీడియా వేదికల్లో విభిన్నమైన అంశాలపై మాట్లాడే సమయంలోనూ, పోస్టులు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ప్రసార మాధ్యమాలు మరియు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు పార్టీ నేతలు, జనసైనికులు, వీర మహిళలు ఖచ్చితంగా పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన సూచించారు.
“వ్యక్తిగత దూషణలు వద్దు.. ఆవేశపడొద్దు”
అనవసర విషయాలపై ఇష్టానుసారంగా విమర్శలు చేయడం, భాషను ఉపయోగించడం మంచిది కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దని, కేవలం పార్టీల సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పందించాలని కోరారు.
ఏ విషయంపై మాట్లాడినా ఆవేశాలకు గురికావద్దని, అసభ్య పదజాలాన్ని అస్సలు వాడొద్దని హెచ్చరించారు. మహిళలను ఎల్లప్పుడూ గౌరవించి మాట్లాడాలని ఆదేశించారు.
పార్టీ అంతర్గత విషయాలపై కఠిన వైఖరి..
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారి విషయంలో ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. పార్టీ అంతర్గత విషయాల పట్ల సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం మాట్లాడకూడదని సూచించారు.
పార్టీ భావజాలాన్ని కించపరిచే వారిని ఉపేక్షించబోమని తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా, జనసైనికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారి ప్రభావానికి లోనుకావద్దని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలని, రాజకీయ శత్రువుల సోషల్ మీడియా ప్రచార వలలో చిక్కుకోవద్దని హెచ్చరించారు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.
పార్టీ అభ్యున్నతి, కష్టపడి పనిచేసే వారి సంక్షేమం ఎప్పుడూ పార్టీ దృష్టిలో ఉంటుందని హామీ ఇస్తూ, సోషల్ మీడియాలో జరుగుతున్న రకరకాల విష ప్రచారాలను తిప్పికొట్టాలని పవన్ కళ్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు.











