YS Sharmila Comments On PM | ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Shamrila) కీలక వ్యాఖ్యలు చేశారు.
గురువారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఈసారైనా అమరావతి కట్టేనా .. లేక మళ్ళీ మట్టేనా అని విమర్శించారు.
పదేళ్ల కిందట మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారని, మన ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్ళారని మండిపడ్డారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోదీకి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామన్నారు.
ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలని వ్యాఖ్యానించారు. మోదీ ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు షర్మిల. మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలన్నారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలని షర్మిల కోరారు. ఇస్తామని ప్రధాని ప్రకటన చేయాలన్నారు.
అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని, అలాగే 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని షర్మిల అన్నారు.











