- 10 వేల మందికి పైగా భారతీయులకు రక్షణ!
MHA I4C WhatsApp Hijack | దేశవ్యాప్తంగా విరుచుకుపడుతున్న వాట్సాప్ ఖాతాల హైజాకింగ్ సైబర్ దాడిని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సమర్థవంతంగా తిప్పికొట్టింది.
సహ్యోగ్ (Sahyog) పోర్టల్ ద్వారా కమాండ్-అండ్-కంట్రోల్ (C2) సర్వర్లను జియో-బ్లాక్ చేయడంతో పాటు పక్కా సమన్వయ చర్యలతో ఇప్పటివరకు 10,000 మందికి పైగా భారతీయులను ఈ సైబర్ ప్రచారం నుండి రక్షించినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) శుక్రవారం వెల్లడించింది.
నకిలీ ‘జిప్’ (ZIP) ఫైళ్లతో వాట్సాప్ హైజాక్..
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) కు అందిన ఫిర్యాదులను విశ్లేషించిన ఐ4సి, ఈ సైబర్ మోసాల వెనుక ఉన్న ప్రమాదకరమైన పద్ధతిని గుర్తించింది.
బాధితులకు వాట్సాప్, ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా Statement of Account.zip, RBI.zip, లేదా MCA.zip పేరుతో కంప్రెస్డ్ ఫైళ్లు పంపుతున్నారు. ఇవి నిబంధనల నోటీసులుగా లేదా బ్యాంక్ ఖాతా వివరాలుగా నమ్మించేలా రూపొందిస్తున్నారు.
కంప్యూటర్లలో ఓపెన్ చేస్తే వైరస్: బాధితులు ఈ ఫైల్ను తమ విండోస్ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లలో ఓపెన్ చేయగానే ఒక ‘ట్రోజన్’ (Trojan) వైరస్ ఇన్స్టాల్ అవుతుంది. అది ఆ పరికరాన్ని దెబ్బతీసి, యాక్టివ్గా ఉన్న వాట్సాప్ వెబ్ (WhatsApp Web) సెషన్ను హైజాక్ చేస్తుంది.
ఖాతా హ్యాక్ అయిన వెంటనే, బాధితుడి వాట్సాప్లోని కాంటాక్ట్లు మరియు గ్రూప్లకు ఆటోమేటిక్గా ఈ మాల్వేర్ ఫైల్ వెళ్తుంది. కంపెనీ ఫైనాన్స్ మేనేజర్కు పంపాలని కోరడం ద్వారా కార్పొరేట్ నెట్వర్క్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
అత్యంత ప్రభావిత రాష్ట్రాలు & హెచ్చరికలు..
ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర మరియు రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా నమోదైనట్లు హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మోసాలకు ఉపయోగపడుతున్న మాల్వేర్లు మరియు సర్వర్లను సహ్యోగ్ పోర్టల్ ద్వారా కేంద్రం నిరంతరం బ్లాక్ చేస్తోంది.
గుర్తుతెలియని వ్యక్తులు లేదా ఈ-మెయిల్ల ద్వారా వచ్చే ఆర్బీఐ, ఆదాయపు పన్ను శాఖ, లేదా ఎంసీఏ పేరుతో ఉన్న ప్రమాదకరమైన .zip ఫైళ్లను కంప్యూటర్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిచి చూడవద్దని సైబర్ నిపుణులు పౌరులను విజ్ఞప్తి చేస్తున్నారు.











