ASHA Worker Leelamma | అమ్మ ప్రేమకు ఈ ప్రపంచంలో ఏదీ సాటిరాదని మరోసారి నిరూపించే విషాద ఘటన మార్కాపురం జిల్లాలోని అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో చోటు చేసుకుంది.
తన ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా, తన బిడ్డ ప్రాణాలనే ముఖ్యంగా భావించిన ఓ తల్లి చివరకు మాతృత్వం కోసం తన ప్రాణాలను అర్పించింది.
కాకర్ల గ్రామానికి చెందిన గుంటు లీలమ్మ (40) ఆశా కార్యకర్తగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యంగా, 2018లో ఆమె వివాహం జరిగింది.
వివాహమైన ఎన్నో సంవత్సరాల తర్వాత ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే గర్భధారణ సమయంలో ఆమెకు తీవ్రమైన గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితిలో గర్భాన్ని కొనసాగించడం ప్రమాదకరమని హెచ్చరించారు.
అనంతరం పెద్ద ఆసుపత్రిలో గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు చికిత్స అందించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
గర్భధారణ చివరి దశకు చేరుకున్న తర్వాత లీలమ్మ ఆరోగ్యం మళ్లీ విషమించడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, తల్లి లేదా బిడ్డలో ఒకరిని మాత్రమే కాపాడగలమని కుటుంబ సభ్యులకు వివరించారు.
అయితే, తన ప్రాణాల కంటే “నా బిడ్డనే కాపాడండి” అని లీలమ్మ వైద్యులను కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె పట్టుదలతో భర్త సమ్మతి పత్రంపై సంతకం చేయగా, వైద్యులు సిజేరియన్ శస్త్రచికిత్స నిర్వహించారు.
శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై పండంటి మగబిడ్డ జన్మించాడు. అయితే, తన బిడ్డను ఒక్కసారి కూడా చూడకుండానే లీలమ్మ తుదిశ్వాస విడిచింది.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. లీలమ్మ త్యాగం ప్రతి తల్లి ప్రేమకు ప్రతీకగా నిలిచిందంటూ స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.











