Amruta Fadnavis Bicycle Ride | మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ముంబై నగర వీధుల్లో సైకిల్ తొక్కుతూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపునకు స్పందిస్తూ ఆమె ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను కూడా ఆమె తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. పెట్రోల్, డీజిల్ ఆదా కోసమే – అమృతా ఫడ్నవీస్ తమ ఇళ్ల పరిసరాల్లోని స్వల్ప దూర ప్రయాణాలకు ఇకపై లగ్జరీ వాహనాలను వాడబోనని అమృతా ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
5-7 కిలోమీటర్ల పరిధిలో సైకిల్ ప్రయాణం..
“ఇంధనాన్ని ఆదా చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ జీ ఇచ్చిన పిలుపు నన్ను ఎంతగానో ప్రేరేపించింది. అందుకే నా ఇంటి నుండి 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఉండే అన్ని రకాల పనుల కోసం నేను సైకిల్ ఉపయోగించడం ప్రారంభించాను” అని ఆమె తెలిపారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి..
పెట్రోల్, డీజిల్ ఆదా చేయడంతో పాటు.. శారీరక ఫిట్నెస్ సాధించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి కూడా ఈ నిర్ణయం ఒక చిన్న వ్యక్తిగత అడుగు అని ఆమె పేర్కొన్నారు.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ను సైతం వదులుకొని..
ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు (Austerity) పిలుపునకు అమృతా ఫడ్నవీస్ స్పందించడం ఇది మొదటిసారేం కాదు. ఇదే నెల ప్రారంభంలో ఫ్రాన్స్లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ (Cannes Film Festival) కు సైతం ఆమె వెళ్లకుండా నిలిచిపోయారు.
మహారాష్ట్ర సంస్కృతిని, రాష్ట్ర చేనేత వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించేందుకు ఆమెకు అధికారికంగా ఆహ్వానం అందినప్పటికీ.. ప్రధాని పిలుపునకు గౌరవం ఇస్తూ ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఆమె గతంలోనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.







