Kishan Reddy on Women’s Reservation Bill 2026 failure | 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది మహిళల దశాబ్దాల కలను కాంగ్రెస్ తన రాజకీయ స్వార్థం కోసం చిదిమేసిందని ఆయన ధ్వజమెత్తారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన రోజును భారత ప్రజాస్వామ్య చరిత్రలో ‘చీకటి రోజు’గా కిషన్ రెడ్డి అభివర్ణించారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక అవకాశాన్ని విపక్షాలు కాలరాశాయని మండిపడ్డారు.
“ఇది కేవలం ఒక చట్టాన్ని వ్యతిరేకించడం కాదు, దేశంలోని మహిళా శక్తిని (శక్తి స్వరూపిణి) అవమానించడమే. మహిళలు చట్టసభల్లోకి వస్తే తమ పీఠాలు కదులుతాయనే భయం కాంగ్రెస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది” అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి మహిళా సాధికారత కంటే కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువని, పదవుల మీద ఉన్న ఆశ మహిళల అభివృద్ధిపై లేదని ఆయన ఎద్దేవా చేశారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన దుష్టబుద్ధిని మరోసారి బయటపెట్టుకుందని కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
మహిళా రిజర్వేషన్ల అంశాన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేయడంతో రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 వంతు మెజారిటీ లభించలేదు. దీనిపై బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తోంది.







