Posters Against Rahul Gandhi | కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన యూడిఎఫ్ (UDF) కూటమిలో ముఖ్యమంత్రి పదవి కోసం పోరు ముదురుతోంది. ఒకవైపు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, మరోవైపు ప్రజాదరణ ఉన్న వీడీ సతీశన్ మధ్య పోటీ తీవ్రతరమైంది.
ఈ నేపథ్యంలో వాయనాడ్లో రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం కేరళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మంగళవారం జరిగిన కీలక సమావేశంలో తొమ్మిది మంది పార్టీ నేతల్లో ఆరుగురు వేణుగోపాల్కే మద్దతు పలికారు.
అయితే, కే మురళీధరన్, వీఎం సుధీరన్ వంటి నేతలు మాత్రం వీడీ సతీశన్ వైపు మొగ్గు చూపారు. రమేష్ చెన్నితల కూడా ఈ రేసులో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.
రాహుల్ గాంధీని ఉద్దేశించి “కేసీ మీ బ్యాగ్ మోసే వ్యక్తి కావచ్చు, కానీ కేరళ ప్రజలు మిమ్మల్ని క్షమించరు” అంటూ వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి.
అంతేకాకుండా “వాయనాడ్ మరో అమేథీ అవుతుంది”, “RG మరియు PG ఈ తప్పుకు కేరళ మిమ్మల్ని వదిలిపెట్టదు” వంటి తీవ్ర వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
గత ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉండి పార్టీని గెలిపించిన వీడీ సతీశన్కే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు.
మరోవైపు ఐయూఎంఎల్ (IUML) వంటి కీలక మిత్రపక్షాలు కూడా సతీశన్కే మద్దతు ఇస్తున్నాయి. ప్రతిపక్షాల హస్తం?: ఈ పోస్టర్ల వెనుక సీపీఐ(ఎం) కార్యకర్తల హస్తం ఉండవచ్చని కాంగ్రెస్ అనుమానిస్తోంది.
త్రిసూర్ జిల్లాలో ఇప్పటికే ఒక సీపీఐ(ఎం) కార్యకర్త తాను ఫ్లెక్స్ బోర్డులు పెట్టినట్లు వాట్సాప్ గ్రూపులో అంగీకరించడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది.







