- ‘వికసిత్ భారత్’ అని చెప్పా..
- చరణ్తో పీఎం పంచుకున్న స్ఫూర్తిదాయకమైన రియల్ స్టోరీ!
Ram Charan Shares PM Modi Story | గ్లోబల్ స్టార్ రాంచరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’.
జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే గురువారం రోజున సినిమా యూనిట్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించింది.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన భారీ మీడియా సమావేశంలో రాంచరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, వర్సటైల్ యాక్టర్ బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ.. గతంలో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ‘పెద్ది’ సినిమా ప్రస్తావన వచ్చినట్లు రాంచరణ్ వెల్లడించారు. “పెద్ది సినిమా కథ దేని గురించి అని ప్రధాని మోదీ గారు నన్ను ఆరా తీశారు.
దానికి నేను స్పందిస్తూ.. ఇది మన దేశ ప్రగతిని ప్రతిబింబించే ‘వికసిత్ భారత్’ గురించి చెప్పే కథ అని ప్రధానికి సమాధానం ఇచ్చాను” అని చరణ్ పేర్కొన్నారు.
బెంగాల్ ఫుట్బాల్ ప్లేయర్ కథ చెప్పిన ప్రధాని మోదీ..
రాంచరణ్ మాటలు విన్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక రియల్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీని చరణ్తో పంచుకున్నారట.
“పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలో మహమ్మద్ అనే అసాధారణ ఫుట్బాల్ ప్లేయర్ ఉండేవారు. ఆయన తన ప్రతిభతో భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై ప్రాతినిధ్యం వహించి, తన గ్రామానికి దేశవ్యాప్తంగా గొప్ప పేరు తీసుకువచ్చారు” అని ప్రధాని చెప్పారు.
ఆ మహమ్మద్ ఇచ్చిన అద్భుతమైన స్ఫూర్తితో.. ఈరోజు అదే మారుమూల గ్రామం నుంచి ఏకంగా 85 మంది ఫుట్బాల్ ప్లేయర్లు తయారయ్యారని ప్రధాని మోదీ తనకు వివరించినట్లు రాంచరణ్ గుర్తుచేసుకున్నారు.
‘పెద్ది’ సినిమా కూడా సరిగ్గా ఇలాగే ఇతరులకు కొండంత స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన కథాంశంతో రూపొందిందని గ్లోబల్ స్టార్ స్పష్టం చేశారు.







