SC Judgment On Consensual Relationship Between Unmarried Adults | మారుతున్న సామాజిక వాస్తవాల పట్ల ప్రభుత్వాలు, నియామక బోర్డుల వంటి అధికారిక యంత్రాంగాలు మరింత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పరస్పర అంగీకారంతో ఉన్న ఇద్దరు అవివాహిత వయోజనుల (Unmarried Adults) మధ్య శారీరక సంబంధం ఉన్నంత మాత్రాన.. కేవలం ఆ ఒక్క కారణం ఆధారంగా ఒక వ్యక్తి నడవడికపై ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేమని తేల్చి చెప్పింది.
తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థి ఎంపిక రద్దును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
కేసు నేపథ్యం ఇదే..
2014లో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్గా తాత్కాలికంగా ఎంపికైన ఒక అభ్యర్థిపై గతంలో ఒక క్రిమినల్ కేసు నమోదైంది. తనకు తెలిసిన ఒక మహిళతో పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసి లైంగిక సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణల ఆధారంగా ఈ కేసు పెట్టారు.
అయితే, ఈ వివాదం 2015లోనే లోక్ అదాలత్ ముందు పరస్పర రాజీతో ముగిసింది. సదరు అభ్యర్థి తన కానిస్టేబుల్ ఉద్యోగ దరఖాస్తు ఫారంలో ఈ కేసు వివరాలను ముందుగానే స్పష్టంగా వెల్లడించారు. అయినప్పటికీ, ఈ కేసు నైతిక పతనాన్ని ప్రతిబింబిస్తోందన్న కారణంతో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతని ఎంపికను రద్దు చేసింది.
దీనిపై సుదీర్ఘ లీగల్ పోరాటం తర్వాత బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీల్పై విచారణ జరిపి బోర్డు నిర్ణయాన్ని తప్పుపట్టింది.
‘ప్రతి సంబంధం వివాహంతోనే ముగియదు’..
ఈ సందర్భంగా ధర్మాసనం నియామక బోర్డుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. “పరస్పర అంగీకారంతో ఇద్దరు అవివాహిత వయోజనులు తమ ఇష్టానుసారం సంబంధం కలిగి ఉండటాన్ని దేశంలో ఏ చట్టమూ నిషేధించలేదు.
వారి వ్యక్తిగత సంబంధం ఆధారంగా నడవడికను తప్పుపట్టడం సరికాదు. ప్రతి సంబంధం వివాహంతోనే ముగియాలని లేదు. కేవలం ఒక సంబంధం పెళ్లికి దారితీయలేదన్న ఒకే ఒక్క కారణంతో.. ఒక పక్షం మరొక పక్షాన్ని మోసం చేసిందని ముద్ర వేయలేం” అని కోర్టు స్పష్టం చేసింది.
వివాహానికి ముందు ఇటువంటి సంబంధాలు నానాటికీ సర్వసాధారణం అవుతున్నాయని, ఇద్దరి మధ్య గణనీయమైన కాలం పాటు సంబంధం కొనసాగితే అది చెల్లుబాటు అయ్యే అంగీకారమేనని భావించవచ్చని పేర్కొంది.
రాజీ పడటం నేరాంగీకారం కాదు..
లోక్ అదాలత్ ముందు వివాహ వాగ్దానంపై నమోదైన అత్యాచారం కేసులో రాజీ పడటం అనేది, అభ్యర్థి తన నేరాన్ని అంగీకరించినట్లు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సదరు రాజీ బలవంతంగా జరిగిందని సూచించే బలమైన ఆధారాలు రికార్డుల్లో ఉంటే తప్ప, కేవలం కేసు రాజీతో ముగిసిందన్న కారణంతో యజమాని (Employer) ప్రతికూల నిర్ధారణకు రాలేరని పేర్కొంది.
అభ్యర్థి, ఫిర్యాదుదారు చాలా సంవత్సరాలుగా ఒకరికొకరు తెలిసిన ఇరుగుపొరుగు వారని, ఇక్కడ ఫిర్యాదుదారు స్వయంగా కేసును కొనసాగించకూడదని నిర్ణయించుకుని రాజీకి అంగీకరించినందున.. అభ్యర్థికి పోలీస్ సేవకు అవసరమైన నైతికత లేదని నిర్ధారించడానికి రిక్రూట్మెంట్ బోర్డుకు ఎలాంటి హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది.
చివరగా, ముగింపు దశకు చేరుకున్న నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను అంచనా వేసే ప్రభుత్వ యంత్రాంగాల కోసం సుప్రీంకోర్టు ఒక విస్తృత మార్గదర్శక సూత్రాన్ని కూడా ఈ తీర్పు ద్వారా నిర్దేశించింది.







