Nara Lokesh 150 feet cutout Vijayawada | తెలుగుదేశం పార్టీ (TDP) వార్షిక పండుగ ‘మహానాడు’ బుధవారం ఉదయం హైబ్రిడ్ విధానంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనగా.. విజయవాడలో ఏర్పాటు చేసిన ఒక భారీ కటౌట్ ఇప్పుడు యావత్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
రూ. 18 లక్షల వ్యయం.. 150 అడుగుల కటౌట్!
మహానాడును పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. విజయవాడ కృష్ణానదీ తీరంలోని పవిత్ర ‘సీతమ్మ వారి పాదాల’ వద్ద ఏకంగా 150 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ను ఆయన ఆవిష్కరించారు.
రూ. 18 లక్షల భారీ వ్యయంతో నిర్మించిన ఈ కటౌట్లో యుగపురుషుడు ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులతో పాటు మంత్రి నారా లోకేశ్ రూపాలు కొలువుదీరాయి. కృష్ణానదీ తీరంలో గంభీరంగా కనిపిస్తున్న ఈ కటౌట్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ పార్టీ శ్రేణుల నూతన ఉత్సాహంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి నారా లోకేశ్ గారు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ (TDP National Working President) హోదాలో అడుగుపెట్టిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మహానాడు ఇదే కావడంతో తమ్ముళ్లలో మునుపెన్నడూ లేని సరికొత్త జోష్ కనిపిస్తోందని వెంకన్న పేర్కొన్నారు.
యువనాయకత్వం వైపు పార్టీ శ్రేణులు ఎంతగా ఆకర్షితులవుతున్నారో చెప్పడానికి ఈ భారీ కటౌటే నిదర్శనమన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ను వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు, భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసేందుకు ఈ మహానాడు వేదిక కానుందని వెల్లడించారు.
ఈ రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, సంచలన రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ఆమోదించనున్నట్లు స్పష్టం చేశారు.







