- మరో 70 మంది చిన్నారులకు పంపిణీ..
- ఇప్పటివరకు 400 మందికి అందజేత!
Jaggareddy bicycle distribution | నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, తనదైన శైలిలో ప్రజాసేవ చేసే సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ‘సైకిళ్ల పంపిణీ’ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా మరో 70 మంది చిన్నారులకు ఆయన స్వహస్తాలతో సైకిళ్లను పంపిణీ చేశారు.
ముఖ్యంగా 8 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల శారీరక ఉల్లాసం, ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. ఈ తాజా విడతతో కలిపి సంగారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 400 మంది చిన్నారులకు సైకిళ్ల పంపిణీ విజయవంతంగా పూర్తి అయినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.
వచ్చే ఆదివారం మరో 156 మందికి..
ఈ సేవా కార్యక్రమాన్ని కేవలం ఒక రోజుతో ముగించకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నారు. గతంలోనే తమ కార్యాలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకున్న మరో 156 మంది చిన్నారులకు జగ్గారెడ్డి స్వయంగా టోకెన్లను అందజేశారు.
ఈ టోకెన్లు పొందిన చిన్నారులందరికీ రాబోయే ఆదివారం సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
జగ్గారెడ్డి కార్యాలయంలో ఐడెంటిటీ ప్రూఫ్ జిరాక్స్ ఇచ్చి, తమ పేర్లను నమోదు చేసుకున్న అర్హులైన చిన్నారులందరికీ విడతల వారీగా వంద శాతం సైకిళ్లను అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
చిన్నారులతో జగ్గారెడ్డి సరదా ముచ్చట్లు..
సైకిళ్ల పంపిణీ వేదికపై జగ్గారెడ్డి ఒక సీనియర్ లీడర్లా కాకుండా, చిన్నారులతో ఎంతో చొరవగా కలిసిపోయారు. సైకిళ్లు అందుకున్న పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ, వారికి షేక్హ్యాండ్ ఇస్తూ, ‘హాయ్’ చెప్తూ సందడి చేశారు.
జగ్గారెడ్డి పిల్లలతో అంతలా కలిసిపోవడాన్ని చూసి అక్కడకు వచ్చిన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు కూన సంతోష్, సుదీప్ మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.







