CM Chandrababu self census online | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జనగణన (Census-2026) ప్రక్రియ గురువారం అధికారికంగా ప్రారంభమైంది.
ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్వీయ జనగణన’ (Self-Enumeration) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో ప్రారంభించారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆయన తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేశారు.
33 ప్రశ్నలతో ఫాం..
హౌస్ లిస్టింగ్ మరియు హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన 33 ప్రశ్నలతో కూడిన ఫామ్ ను సీఎం పూర్తి చేశారు. ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ ఈ ప్రక్రియను ముఖ్యమంత్రికి దగ్గరుండి వివరించారు. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించేవారు.
కానీ ఈసారి సాంకేతికతను జోడించి, ప్రజలే నేరుగా అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఇళ్లకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ప్రజలు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో డిజిటల్ విధానాన్ని అనుసరించడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కచ్చితమైన గణాంకాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.






