CM Chandrababu Comments on MaViGun | ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ‘మావిగన్’ (MAVIGUN) ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది.
జగన్ ఆలోచనను తీవ్రంగా తప్పుబట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇది రాజధానిపై ఆయనకు ఉన్న ద్వేషానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
గురువారం కూటమి నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో సీఎం ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. రాజధాని అమరావతికి ప్రత్యామ్నాయంగా జగన్ ఒక సరికొత్త ‘ప్లాన్-బి’ని తెరపైకి తెచ్చారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని కలిపి ఒక అద్భుత నగరంగా మార్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
మచిలీపట్నంలోని MA, విజయవాడలోని VI, గుంటూరులోని GUN అక్షరాలను కలిపి ‘MAVIGUN’ అని నామకరణం చేయాలని సూచించారు.
“గన్ అంటే జగన్ గుర్తుకు వస్తాడని అనుకుంటే, వేరే పేరు పెట్టినా నాకేం అభ్యంతరం లేదు” అని జగన్ వ్యాఖ్యానించారు.
జగన్ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాశనం చేసి.. ఇప్పుడు కొత్త పేర్లా?” అని విమర్శించారు.
“జగన్ కు అమరావతి అనే పేరు పలకడమే ఇష్టం లేదు. ఐదేళ్ల పాలనలో రాజధానిని సర్వనాశనం చేసి, ఇప్పుడు కొత్త రాగాలు తీస్తున్నారు.”
రాజధాని విషయంలో జగన్ వైఖరి భవిష్యత్తులో కూడా మారదు అనేదానికి ఈ ‘మావిగన్’ ఆలోచనే నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని నిర్మిస్తుంటే, దానిపై విషం చిమ్మడం జగన్ కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.






