Kishan Reddy Slams Congress Govt | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తతలకు దారితీసింది.
శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సహా సీనియర్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచి వేయలేరని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అభద్రతాభావానికి అద్దం పడుతోందని విమర్శించారు.
“తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా? లేక పోలీస్ బలగాలతో పాలిస్తున్నారా?” అని ఆయన ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగించాలనుకోవడం ప్రభుత్వ భ్రమ మాత్రమేనని ఎద్దేవా చేశారు.
పచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తామిచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే ఎందుకు ఉలిక్కిపడుతోందని నిలదీశారు.
‘ప్రజా పాలన’ పేరుతో యువత, రైతులు, మహిళలను రేవంత్ సర్కారు నిట్టనిలువునా మోసం చేసిందని మండిపడ్డారు.
ప్రభుత్వానికి కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని, ఈ అసమర్థ పాలనపై బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అవినీతి, అరాచక పాలకులను గద్దె దించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.
బీజేపీ నేతల అరెస్టులు కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.






