Indiramma Kutumba Jeevitha Bheema Scheme | తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, యావత్ దేశంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే ధ్యేయంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని’ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభ వేదికగా ప్రకటించారు.
కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఈ ఏడాది జూన్ 2 (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నుండి ఈ పథకం పట్టాలెక్కనుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 4,000 కోట్లను కేటాయించింది.
భయం లేని భవిష్యత్తు కోసం..
“కుటుంబంలో సంపాదించే వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడుతోంది. అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతోంది.
అలాంటి భయం ఏ కుటుంబంలోనూ ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం” అని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో ఆవేదనతో కూడిన భరోసాను ఇచ్చారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లేని విధంగా ఈ భారీ స్థాయి బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయబోతున్నామని ఆయన గర్వంగా ప్రకటించారు.
ఆరు గ్యారంటీలకు పెద్దపీట
మొత్తం రూ. 3,24,234 కోట్ల బడ్జెట్లో ఆరు గ్యారంటీల అమలు కోసమే ప్రభుత్వం రూ. 50,713 కోట్లను కేటాయించడం గమనార్హం. ఇందులో భాగంగానే ఈ జీవిత భీమా పథకం సామాన్యుడికి కొండంత అండగా నిలవనుంది.






