Gaddar Film Awards 2025 | తెలంగాణ ప్రభుత్వం 2025 సంత్సరానికి గానూ గద్దర్ సినీ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర జ్యూరీ కమిటీ ఈ అవార్డుల కోసం ఎంపిక ప్రక్రియ నిర్వహించింది.
ఈ ఏడాది మొత్తం 17 విభాగాల్లో గద్దర్ ఫిలిం అవార్డ్స్-2025ను ప్రకటించారు. జ్యూరీ కమిటీ సభ్యులు తుది జాబితాను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో ‘రాజు వెడ్స్ రంభాయి’ మొదటి బహుమతిని గెలుచుకుంది.
‘దండోరా’ రెండో ఉత్తమ చిత్రంగా, ‘వెడ్డింగ్ ఫోటోగ్రఫీ’ మూడో ఉత్తమ చిత్రంగా నిలిచాయి. తండేల్ సినిమాకుగానూ నాగ చైతన్య ఉత్తమ నటుడిగా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రష్మిక మందన్న ఉత్తమ నటిగా గద్దర్ అవార్డులకు ఎంపికయ్యారు.
ప్రత్యేక పురస్కారాల విభాగంలో ప్రముఖ నటుడు చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ప్రముఖ నటి జయసుధకు ఏఎన్ఆర్ అవార్డు వరించాయి.
దర్శకుడు, నటుడు ఆర్. నారాయణమూర్తికి కాంతారావు అవార్డు, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు బి.ఎన్. రెడ్డి అవార్డు, ప్రముఖ నటుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు ప్రకటించారు.
గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు లభించింది. ఉగాది పండుగ సందర్భంగా ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేయనుంది.










