Revanth Reddy On Hydraa | హైదరాబాద్ నగరంలో ఆక్రమణకు గురైన చెరువులను హైడ్రా పునరుద్దరిస్తున్న విషయం తెల్సిందే. ఆక్రమణల నుంచి చెరువులను కాపాడుతూ వాటిని శుభ్రం చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం హైడ్రా చేస్తోంది.
ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దశాబ్దాల కాలంలో పాలకుల నిర్లక్ష్యం, కొందరి స్వార్థం, కబ్జాదారుల స్వైరవిహారంతో కుంచించుకుపోయి, కనుమరుగైపోయిన హైదరాబాద్ చెరువులకు తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
ప్రకృతి వనరులను మన స్వార్థానికి బలి చేస్తే భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం చేసినవాళ్లమవుతామని హెచ్చరించారు. నగర ప్రజలు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలన్న లక్ష్యంతో చెరువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోన్న హైడ్రాకు, సహకరిస్తున్న నగర ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.









