MS-Dhoni-Fined | టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) మరోసారి వార్తల్లో నిలిచారు. ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ధోని ప్రశాంత జీవితాన్ని గడుపుతున్న విషయం తెల్సిందే.
బైక్, కార్ నడుపుకుంటూ తరచుగా ధోని రాంచీ రోడ్లపై సందడి చేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతాయి. అయితే తాజాగా మాత్రం ఓవర్ స్పీడ్ కారణంగా ధోని వార్తల్లో నిలిచారు.
రాంచీలో ఓవర్ స్పీడ్ కారణంగా ఆయన మెర్సిడెస్ బెంజ్ కారుపై రూ.1,000 ట్రాఫిక్ ఈ-చలాన్ పడింది. ఈ ఘటన మార్చి 1 జరిగింది. రాంచీలోని కాంకే రింగ్ రోడ్పై బీర్సా అగ్రికల్చరల్ యూనివర్సిటీ సమీపంలో ఈ ఉల్లంఘన జరిగింది.
ఆ ప్రాంతంలో వేగ పరిమితి 60 కి.మీ/గంట మాత్రమే. కానీ ధోని కారు 91 కి.మీ వేగంతో వెళ్తున్నట్లు రాంచీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ (ATMS) కెమెరాలు రికార్డు చేశాయి.
అనంతరం రూ.1,000 ఈ-చలాన్ ఆటోమేటిక్గా జారీ అయింది. ఈ రోడ్ ధోని నివాసానికి చాలా దగ్గరగా ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధోని ఐపీఎల్-2026 సీజన్ కోసం సిద్ధం అవుతున్నారు.






