‘Did World War 3 just start?’ | అమెరికా-ఇజ్రాయిల్ దేశాల సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఆయన టెహ్రాన్ లోని కార్యాలయంపై జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అనే ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) కమాండర్ మహమ్మద్ పక్పూర్, సుప్రీం లీడర్ సలహాదారు అలీ షమ్ఖానీ, ఖమేనీ కుమార్తె, మనుమడు, కోడలు, అల్లుడు సహా సుమారు 40 మంది కీలక నేతలు, అధికారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్ను ‘ఎపిక్ ఫ్యూరీ’గా పిలిచి, ఇరాన్లో అధికార మర్పిడిని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు. “చరిత్రలో అత్యంత దుష్ట వ్యక్తి ఖమేనీ” అని వ్యాఖ్యానించి, దాడులు వారం పాటు కొనసాగుతాయని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్ ప్రజలను పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఖమేనీని అమరవీరుడిగా ప్రకటించి ”ఇస్లామిక్ ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది” అని పేర్కొన్నారు. చరిత్రలో అత్యంత వినాశకరమైన దాడులు ప్రారంభిస్తున్నట్లు ఐఆర్ జీసీ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ మిస్సైల్-డ్రోన్ దాడులు చేసి ఇజ్రాయెల్ను, యూఏఈ, ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. “అత్యంత వినాశకరమైన ప్రతీకారం” చేపట్టనున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది.










