Jammu Kashmir Wins Maiden Ranji Trophy Victory | అద్భుత ప్రదర్శనతో జమ్మూకశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. 1959-60 ఎడిషన్ లో జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీలో పాల్గొంది. అయితే 67 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్స్ లో అడుగుపెట్టిన ఆ జట్టు కర్ణాటక జట్టును ఓడించి చరిత్రను లిఖించింది. ట్రోఫీ ఆది నుండి అద్భుత ఆట తీరుతో, జట్టు సమిష్టి కృషితో రంజీ ట్రోఫీని ముద్దాడడం పట్ల దేశ క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం జమ్మూకశ్మీర్ లో క్రికెట్ కు మరింత ఉత్తేజాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. హుబ్బళ్లి వేదికగా కర్ణాటక-జమ్మూకశ్మీర్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. జమ్మూ తొలి ఇన్నింగ్స్ లో 584 భారీ స్కోరు చేసింది.
కర్ణాటక తొలి ఇన్నింగ్స్ లో కేవలం 293 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. ట్రోఫీ మొత్తం తన బౌలింగ్ తో చెలరేగిన ఆకీబ్ నబీదర్ ఐదు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో జమ్మూ 342 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అయితే శనివారం మ్యాచ్ చివరి రోజు కావడం అప్పటికి కేవలం ఒక సెషన్ ఆట మాత్రమే మిగిలి ఉంది. దింతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యాన్ని సాధించిన జమ్మూ విజేతగా నిలిచింది. కర్ణాటక జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జమ్మూ జట్టు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా చెలరేగిపోయింది. ఈ తరుణంలో ఫైనల్స్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శుభమ్ పుందిర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఆకీబ్ నబీ ఎన్నికయ్యారు.










