CM Revanth Reddy News | ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యా రంగం పట్ల తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించారు.
జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణలోనూ త్వరలోనే ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్నట్లు విద్యా విధానం కోసం ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించామని, త్వరలోనే ఆ పాలసీని అమలులోకి తీసుకురాబోతున్నట్లు సీఎం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించడమే కాకుండా పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకేచోట మినీ యూనివర్సిటీ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను నిర్మిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.










