Deputy Cm Pawan Kalyan News | ఇండీ కూటమి పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను బెదిరించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులోని తిరుప్పరకుండ్రం కొండపై దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించే విషయంలో అక్కడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి, దర్గా కమిటీ మధ్య వివాదం తలెత్తింది.
ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలో పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించవచ్చని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఇటీవల తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పు పక్షపాతంగా ఉందని పేర్కొంటూ డీఎంకే నేతృత్వంలోని 120 మంది ఎంపీలతో కూడిన బృందం న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం పై సంతకాలు చేసి ఆ నోటీసును లోకసభ స్పీకర్ కు అందజేశారు. దింతో పవన్ స్పందించారు. హిందూ మతానికి చెందిన స్థలంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న కార్తీక దీపం వెలిగించే ఆచారాన్ని కొనసాగించేందుకు భక్తుల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చినందుకు ఒక విధుల్లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తినే లక్ష్యంగా చేసుకున్నారని పవన్ ఆరోపించారు.
హిందూ భక్తుల హక్కులను కాపాడుతూ తీర్పు ఇచ్చినందుకు ఇలా ఒక న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఏమిటి? ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? అని ప్రశ్నించారు. హిందువులు తమ మతాచారాలను ఆచరించడం కూడా భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకమని కాదన్నారు. సెక్యులరిజం రెండువైపులా నడవాలని ఒకవైపే నడిస్తే అది సెక్యులరిజం కాదు, అది సెలెక్టివ్ సూడో సెక్యులరిజం అవుతుందని పవన్ హాట్ కామెంట్స్ చేశారు.










