KTR On SLBC Tunnel Collapse | ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు కి.మీ. మేర పైకప్పు పడిపోయింది.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఎస్.ఎల్.బీ.సీ. టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే వహించాలన్నారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
సుంకిశాలలో రీటైనింగ్ వాల్ ( Retaining Wall ) కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడిపోవడం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.
పైకప్పు కూలిన ఈ ఘటనలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడకుండా నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాలని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఒక బ్యారేజీలో కేవలం పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఈ వరుస వైఫల్యాలపై ఇప్పుడేంమంటారని నిలదీశారు.









