MP Raghav Chadha slams quick commerce | గిగ్ వర్కర్ల దారుణ పరిస్థితిని రాజ్యసభలో ప్రస్తావించారు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. వీరిని భారత ఆర్థిక వ్యవస్థ అదృశ్య చక్రాలుగా అభివర్ణించిన ఆయన 10 నిమిషాల డెలివరీ దౌర్జన్యంను ముగించాలని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల కష్టంతోనే జోమాటో, స్విగ్గి, జెప్టో, బ్లింకిట్, ఓలా, ఉబర్, అర్బన్ కంపెనీ వంటి సంస్థలు బిలియన్ డాలర్ల వాల్యుఏషన్ కు చేరుకున్నాయన్నారు. కానీ గిగ్ వర్కర్ల జీవితాలు మాత్రం రోజూ వారి కూలీల కంటే అద్వాన్నంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిగ్ వర్కర్లు రోబోలు కాదని సదరు సంస్థలకు గుర్తుచేశారు.
‘మనం ఫోన్ లో ఒక బటన్ నొక్కగానే ఆర్డర్ ఆన్ ది వే అని వస్తుంది. కానీ మరోవైపు మాత్రం ఓ మనిషి సమయంతో పరిగెడుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా రేటింగ్ పడిపోతుందని, ఇన్సెంటివ్ పోతుందని, ఐడీ బ్లాక్ అవుతుందని భయంతో ట్రాఫిక్ సిగ్నల్ ను జంప్ చేస్తూ, పరుగులు పెడుతూ, ఓవర్ స్పీడ్ చేస్తూ వెళ్తారు. తీరా వెళ్ళాక నిమిషం ఆలస్యం అయినా కస్టమర్ ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తాడు. ఏ వాతావరణ పరిస్థితి ఉన్నా గిగ్ వర్కర్లకు రక్షణ ఉండదు. పని పరిస్థితిలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. 10 నిమిషాల డెలివరీ మోడల్ కు స్వస్తి పలకాలి’ అని ఈ ఆప్ ఎంపీ స్పష్టం చేశారు.








