KTR News Latest | హైదరాబాద్ పాతబస్తీలో తెరిచి ఉన్న మ్యాన్హోల్ లో ఓ ఐదేళ్ల చిన్నారి పడిన ఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పినా అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మరోవైపు ఇది హైడ్రా సిబ్బంది తప్పు అని జీహెచ్ఎంసీ పేర్కొనగా, జలమండలి సిబ్బంది తప్పిదమని హైడ్రా చెప్పడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
సర్కార్ నడుపుతున్నరా? సర్కస్ నడుపుతున్నరా? అని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్హోల్లో పడిపోయిందని పేర్కొన్నారు. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయని నిలదీశారు.
తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసిందని తెలిపారు.
మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.










