Kavitha slams Jeevan Reddy joining BRS | తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న వరుస పరిణామాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో స్పందించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం, హరీష్ రావు ఢిల్లీ పర్యటన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
“జీవన్ రెడ్డి ఒక పచ్చి సమైక్యవాది. తెలంగాణ ఏర్పాటును ఆయన ఎప్పుడూ వ్యతిరేకించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే చాలు.. మాకు ప్రత్యేక తెలంగాణ అక్కర్లేదు అన్న వ్యక్తి జీవన్ రెడ్డి. అలాంటి వ్యక్తితో రాజకీయ పునరేకీకరణ ఎలా సాధ్యమవుతుంది?” అని కవిత ప్రశ్నించారు.
వెయ్యి ఏళ్లయినా బీఆర్ఎస్ పార్టీ తీరు మారదని, మహిళలకు ఆ పార్టీలో ప్రాధాన్యత ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి న్యాయస్థానాలపై నమ్మకం లేదని కవిత ఆరోపించారు. సీఎం నిర్వహిస్తున్న సభలు కేవలం బల ప్రదర్శన కోసమే తప్ప, ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
హరీష్ రావును ‘గుంటనక్క’ అని సంబోధిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. “హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో నాకు తెలుసు, నువ్వు చెబుతావా.. నన్ను చెప్పమంటావా?” అని సీఎం రేవంత్ సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హరీష్ రావు పర్యటన వెనుక ఉన్న కారణం సీఎంకు నిజంగా తెలిస్తే, ఆ విషయాన్ని నేరుగా ప్రజలకే చెప్పాలని సవాల్ విసిరారు.






