Telangana Congress | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జులై 20న కాంగ్రెస్ పార్టీ భారీ సభకు ప్లాన్ చేస్తుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు.
ఈ సభ ద్వారా మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఖమ్మం సభకు ధీటుగా ఈ సభను నిర్వహించాలని హస్తం నేతలు భావిస్తున్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడం, ముఖ్య నాయకులు పార్టీలో చేరుతున్న సందర్బంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ నాయకులు జాగ్రత్త వహిస్తున్నారు.
అందుకోసం సోమవారం మొయినాబాద్ లో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. సభను ఏ విధంగా విజయవంతం చేయాలో చర్చించారు.
ఈ సమావేశానికి మల్లు రవి, జూపల్లి కృష్ణా రావు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
తెలంగాణ పై ప్రత్యేక దృష్టి..
కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలంగా తెలంగాణ పై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధినాయకత్వం వరుస సభలతో తెలంగాణ కాంగ్రేస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహాంతో ముందుకు పోతుంది. అలాగే ఈ ఏడాది చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధిష్టానం పావులు కదుపుతుంది.
మాజీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జులై 2న ఖమ్మం సభలో అధికారికంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టనున్నరో వివరించారు.
అలాగే బీఆరెఎస్ మరియు బీజేపీలపైన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఖమ్మం సభ విజయవంతం అవ్వడంతో కాంగ్రేస్ పార్టీ మరిన్నీ సభలు నిర్వహించాడానికి సన్నాహాలు చేస్తోంది.
కొంతకాలం బీఆరెఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉండి తర్వాత బీఆరెఎస్ నుండి బహిష్కరించబడిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చాలా రోజుల పాటు తన అనుచరులతో చర్చలు జరిపి చివరకు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఆయనతో పాటు బీఆరెఎస్ ఎమ్మెల్సీ దామోదరరెడ్డి జులై 20న జరగనున్న కొల్లాపూర్ సభలో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో చేరనున్నారు. వారితో పాటు ఇతర జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.
ఈ సభ ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పుంజుకుంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అలాగే బీఆరెఎస్ పార్టీకి ఈ సభ ద్వారా గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని వారు భావిస్తున్నారు.
మరి కొల్లాపూర్ సభ ద్వారా ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎటువంటి హామీలు, వాగ్దానాలు చేస్తారో చూడాలి.
మే 8న సరూర్ నగర్ లో నిర్వహించిన సభలో ప్రియాంక గాంధీ యూత్ ఢిక్లరేషన్ ప్రకటించారు.









