Chandrababu Supports Pawan | ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ (Volunteers)పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పవన్ వ్యాఖ్యలను వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) సీరియస్ గా తీసుకుంది.
జనసేనానిపై కేసులు నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. పవన్ కు మద్దతుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.
తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్యగా అభివర్ణించారు.
“ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు…రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానం అయ్యింది. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలి… ఈ అణచివేత ధోరణి మానుకోవాలి.
నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కేసు పెడతారా?
ప్రజల వ్యక్తిగత వివరాలు…కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు…పైగా దాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచం.
కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలి.
ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే పెద్ద జోక్. 4 ఏళ్ల మీ దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయి.
రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి… రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండి.
ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, వ్యక్తిగత దాడి….మీ ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు.









