- రూ. 2,000 దాటితే 0.4% ఎమ్డీఆర్ ఛార్జ్!
UPI New Rules From October 15 | దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల రుసుముల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు ప్రకటించింది. 2026 అక్టోబర్ 15 నుంచి నేరుగా వ్యాపారులకు (P2M) చేసే రూ. 2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుంది.
అయితే సాధారణ వినియోగదారులకు (Consumers) మాత్రం యూపీఐ సేవలు సంపూర్ణంగా ఉచితంగానే కొనసాగుతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేసింది.
వినియోగదారులకు పూర్తిగా ఉచితం..
వినియోగదారులు షాపుల్లో చెల్లింపులు చేసినప్పుడు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారులు కూడా ఈ రుసుమును బిల్లులో కలిపి కస్టమర్ల నుంచి వసూలు చేయడానికి వీల్లేదు.
రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు మాత్రమే 0.4% MDR వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ షాపులో రూ. 2,000 కన్నా ఎక్కువ చెల్లిస్తే, వ్యాపారి రూ. 8 ఎమ్డీఆర్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 75,000 దాటిన భారీ లావాదేవీలకు ఎంత మొత్తమైనా సరే గరిష్టంగా రూ. 300 ఎమ్డీఆర్ ఫీజు మాత్రమే కేటాయించారు.
రూ. 2,000 లోపు చెల్లింపులకు మినహాయింపు..
రూ. 2,000 కంటే తక్కువ ఉండే వ్యాపార లావాదేవీలపై ఎలాంటి ఎమ్డీఆర్ ఛార్జీలు ఉండవు. (యూపీఐలో జరిగే మొత్తం వ్యాపార లావాదేవీలలో 95% పైగా రూ. 2,000 లోపే ఉంటాయి).
వ్యక్తిగత బదిలీలకు జీరో ఛార్జ్..
స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బులు పంపడం (P2P), లేదా ఒకరి సొంత బ్యాంక్ ఖాతాల మధ్య జరిగే బదిలీలకు (Self-Transfers) ఎంత మొత్తమైనా సరే రూపాయి కూడా ఛార్జ్ ఉండదు.
చిరు వ్యాపారులు.. ప్రత్యేక రంగాలకు మినహాయింపులు..
చిన్న వ్యాపారులకు బెనిఫిట్: నెలకు యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 1 లక్ష వరకు వ్యాపారం పొందే చిన్న, వీధి వ్యాపారులకు (P2PM) రూ. 2,000 దాటిన లావాదేవీలపై కూడా ఎమ్డీఆర్ నుంచి మినహాయింపు ఉంటుంది.
రైల్వేలు, పెట్రోల్ & కరెంట్ బిల్లులు: రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, విద్యుత్, మంచి నీళ్లు, గ్యాస్ బిల్లుల చెల్లింపులకు రూ. 2,000 దాటితే లావాదేవీకి కేవలం ఫ్లాట్ రూ. 5 మాత్రమే ఎమ్డీఆర్ వర్తిస్తుంది.
స్టాక్ మార్కెట్ & మ్యూచువల్ ఫండ్స్: క్యాపిటల్ మార్కెట్, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ చెల్లింపులకు 0.02% ఎమ్డీఆర్ వర్తిస్తుంది (గరిష్ట పరిమితి రూ. 300).
ఈ మార్పులు ఎందుకంటే..
డిజిటల్ పేమెంట్ వ్యవస్థను సురక్షితంగా, బలంగా నిర్వహించడానికి ఏటా రూ. 20,000 కోట్ల వరకు ఖర్చవుతుందని ఎన్పిసిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపాయి. సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడం, బ్యాంకింగ్ నెట్వర్క్ మౌలిక వసతులను మెరుగుపరచడం, సర్వర్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికే ఈ ఎమ్డీఆర్ విధానాన్ని తెచ్చినట్లు వెల్లడించాయి.









