- పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభ ప్రారంభంలో ప్రధాని మోదీ!
PM Modi On Monsoon Session పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session 2026) సోమవారం నాడు ప్రారంభమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విలేకరులతో మాట్లాడారు. ఈ వర్షాకాలం మరియు పార్లమెంట్ సమావేశాలు దేశానికి ఎంతో ‘ఫలవంతంగా’ సాగాలని ఆకాంక్షించారు.
భారతదేశపు స్వదేశీ అంతరిక్ష సామర్థ్యాలను కొనియాడిన ప్రధాని, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా చురకలంటించారు. స్కైరూట్ ఏరోస్పేస్ అనే దేశీయ అంతరిక్ష స్టార్టప్ విజయం వెనుక ఉన్నది ’28 ఏళ్ల యువకులే’ తప్ప, ‘ఏదో 56 ఏళ్ల యువకుడు’ కాదని ఎద్దేవా చేశారు.
అంతరిక్ష రంగంలో భారత సత్తా.. ప్రధాని ప్రశంసలు..
భారత అంతరిక్ష రంగం ఇటీవల సాధించిన వరుస విజయాలను మరియు దేశంలోని యువ ఆవిష్కర్తల కృషిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. “గత ఏడాది వర్షాకాల సమావేశాలకు కొద్ది రోజుల ముందు, ఒక భారత పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్నారు.
మొన్న, భారతదేశానికి చెందిన ఒక యువ స్టార్టప్ చాలా పెద్ద మైలురాయిని సాధించింది. ప్రపంచంలో ఇటువంటి ప్రైవేట్ వెంచర్లు సాధించిన దేశాలు చాలా తక్కువ.
అలాంటి ప్రదేశంలో మన భారతీయ యువత అంతరిక్షంలోకి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది దేశానికి దక్కిన చాలా పెద్ద విజయం.” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
హైదరాబాద్కు చెందిన ‘స్కైరూట్’ స్టార్టప్ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ.. ఆ బృందం సగటు వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమేనని తెలిపారు.
28 ఏళ్ల సగటు వయస్సున్న యువత అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేస్తున్నారని, తాను ఏ 56 ఏళ్ల ‘యువకుడి’ గురించి మాట్లాడటం లేదని రాహుల్ గాంధీ వయస్సును ప్రస్తావిస్తూ పరోక్ష విమర్శలు చేశారు.
‘మిషన్ ఆగమన్’ – కక్ష్యలోకి విక్రమ్-1..
స్కైరూట్ ఏరోస్పేస్ చేపట్టిన ‘విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1’ (Vikram-1 Test Flight-1) ప్రయోగం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. “మిషన్ ఆగమన్” అని నామకరణం చేసిన ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC) నుంచి నిర్వహించారు.
3వ దేశంగా భారత్: 24 మీటర్ల కార్బన్-కాంపోజిట్ రాకెట్ తన చివరి బర్న్ను పూర్తి చేసి, పేలోడ్లను దాదాపు 450 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనితో భారతదేశం సొంతంగా ప్రైవేటు ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే 3వ దేశంగా నిలిచింది.
భౌగోళిక సవాళ్లు ఉన్నా 7.7% ఆర్థిక వృద్ధి..
పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం మరియు అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకుపోతోందని ప్రధాని గుర్తుచేశారు.
ఇంధనం, పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, ఎరువుల దిగుమతులపై ప్రభావం పడినప్పటికీ, భారత్ 7.7 శాతం జిడిపి వృద్ధి రేటును నమోదు చేసి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని తెలిపారు.
ఈ పట్టుదలతోనే దేశం ముందుకు సాగుతోందని, ఎంపీలందరూ వర్షాకాల సమావేశాలలో “పూర్తి మనసుతో” భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
లోక్సభలో కీలక బిల్లులు..
సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సమావేశాల్లో పార్లమెంట్ పలు కీలక కార్యకలాపాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026 ను లోక్సభలో ప్రవేశపెట్టడంతో పాటు, సంతాప తీర్మానాలు, ప్రశ్నోత్తరాల సమయం (Question Hour) మరియు మంత్రివర్గ ప్రకటనలు జరగనున్నాయి.











