- ‘పెద్ది’ వివాదంపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Kangana Ranaut Comments On Peddi | టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘పెద్ది’ కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నప్పటికీ, కొన్ని సీన్ల విషయంలో తీవ్ర వివాదాన్ని ఎదుర్కొంటోంది.
ఈ సినిమాలో మహిళలను వస్తువులా (Objectification) చూపించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, పలువురు సామాజిక విశ్లేషకులు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో, తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కంగనా రనౌత్ నటిస్తూ, ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటున్న ‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhhagya Viddhaata) చిత్ర ప్రచారంలో భాగంగా పీటీఐ (PTI) వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు.
సినిమా అనేది వేర్వేరు ఆలోచనలు, దృక్పథాలు (Perspectives) కలిసి చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ అని ఆమె అభివర్ణించారు.
“ఒక సీన్ సరిగ్గా లేదనిపిస్తే మహిళా నటీమణులు ఎప్పుడైనా తమ అభిప్రాయాన్ని దర్శకుడితో పంచుకోవచ్చు. ఇండస్ట్రీలో ఎవరూ కూడా కావాలని మహిళలను వస్తువులా చూపించాలని సినిమాలు తీయరు.
కానీ, ఒక మూసి ఉన్న గదిలో కొంతమంది పురుషులు మాత్రమే కూర్చుని స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు, ఆ సీన్ ఇంత దారుణంగా (మహిళల కోణంలో) అనిపిస్తుందని వారు ఆలోచించకపోవచ్చు.
ఒక మహిళగా మనం మన పర్స్పెక్టివ్ని పంచుకుని, ‘ఈ సీన్ ఇలా అనిపిస్తోంది, ఇది అంత బాగోలేదు’ అని చెప్తే.. చాలా వరకు దర్శకులు అంగీకరిస్తారు.
‘అవును, మేము మగవాళ్లం ఒకేచోట కూర్చుని రాసేటప్పుడు ఈ కోణంలో ఆలోచించలేదు, ఇది ఇంత బ్యాడ్గా ఉంటుందని అనుకోలేదు’ అని ఒప్పుకుంటారు” అని కంగనా వ్యాఖ్యానించారు.
అసలు ‘పెద్ది’ సినిమాలో వివాదం ఏమిటి..?
తెలుగుతో పాటు పలు భాషల్లో డబ్ అయిన ‘పెద్ది’ చిత్రం విడుదలయ్యాక కొన్ని సీన్లు తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాలో కెమెరా వర్క్, కొన్ని డైలాగులు, అలాగే రామ్చరణ్ – జాన్వీ కపూర్ (అచ్చియమ్మ పాత్ర) మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లు మహిళలను కించపరిచేలా, వస్తువులా చూపించేలా ఉన్నాయని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు.
ఆ సీన్పైనే తీవ్ర అభ్యంతరం..
ముఖ్యంగా సినిమాలో కరెంట్ పోయిన సమయంలో హీరో.. హీరోయిన్ అచ్చియమ్మను బలవంతంగా ముద్దు పెట్టుకునే సీన్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రొమాన్స్ కాదని, ఒక రకంగా ‘లైంగిక దాడి’ (Sexual Assault) లాంటిదేనని ఆన్లైన్లో నెటిజన్లు ధ్వజమెత్తారు.
డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణ..
సోషల్ మీడియాలో ఈ సీన్పై భారీ ఎత్తున నిరసనలు, హంగామా వ్యక్తమవ్వడంతో.. ‘పెద్ది’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించి, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు.
అంతేకాకుండా, వివాదాస్పదంగా మారిన ఆ సీన్లను తక్షణమే మార్చడానికి (Alter) ఆయన అంగీకరించారు.
సినిమాను ఒప్పుకుని పని చేస్తున్నప్పుడు అది ఒక కొలాబరేషన్లా సాగాలని, మహిళలు తమ గళాన్ని ప్రొఫెషనల్గా వినిపించడం ద్వారా ఇలాంటి తప్పులను సరిదిద్దవచ్చని కంగనా రనౌత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.










