- యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల పనులు!
- రూ.1000 కోట్ల నిధులపై కీలక ఆదేశాలు!
CM Revanth Reddy Monsoon Review | తెలంగాణలో వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
రాబోయే నైరుతి రుతుపవనాల కాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, విపత్తు నిర్వహణ మరియు సాగునీటి ప్రాజెక్టుల భద్రతపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కీలక సమీక్షా సమావేశానికి ప్రభుత్వంలోని పలు ముఖ్య శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వ్యవసాయ, నీటి పారుదల (ఇరిగేషన్), పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోమ్ శాఖల అధికారులతో పాటు హైడ్రా (HYDRAA), విపత్తు నిర్వహణ, అగ్నిమాపక (ఫైర్ సర్వీసెస్) శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు నైరుతి రుతుపవనాల గమనం, ఎల్ నినో (El Nino) ప్రభావం మరియు ఈ సీజన్లో నమోదయ్యే వర్షపాతంపై ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా సమగ్ర వివరాలను అందించారు.
ప్రాజెక్టుల మెయింటెనెన్స్, నిధుల విడుదలపై సీఎం ఆదేశాలుః సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింది కీలక నిర్ణయాలు మరియు ఆదేశాలను జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా తక్కువ నీటితో పండే పంటలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖను ఆదేశించారు.
పంట మార్పిడి (Crop Rotation) మరియు పంటల వైవిధ్యత (Crop Diversification) యొక్క ప్రాధాన్యతను అన్నదాతలకు వివరించాలన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల పనులు: రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై సీఎం ఆరా తీశారు.
ప్రాజెక్టుల గేట్లు, ఇతర నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ఇందుకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద అందుబాటులో ఉన్న రూ.1,000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం తక్షణమే వినియోగంలోకి తేవాలని సీఎం ఆదేశించారు.
అలాగే వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల (Bridges) పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేదా పశు నష్టం వాటిల్లినప్పుడు అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా ఆదేశించారు.







