Thursday 28th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఐటీ ఉద్యోగం వదిలి వ్యవసాయంలోకి.. పిడుగుపడి టెక్కీ మృతి!

ఐటీ ఉద్యోగం వదిలి వ్యవసాయంలోకి.. పిడుగుపడి టెక్కీ మృతి!

Lightening in Fields

Bengaluru Techie Killed By Lightning | కార్పొరేట్ జీవితాన్ని వదిలిపెట్టి, మట్టిని నమ్ముకుని వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన ఒక యువ సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌ను పిడుగుపాటు బలితీసుకుంది.

మైసూరు సమీపంలోని యలవాల వద్ద మంగళవారం (మే 26న) జరిగిన ఈ ఘోర పీడకల లాంటి సంఘటనలో బెంగళూరుకు చెందిన టెక్కీ రోషన్ బాలకృష్ణ (హోసోక్లు రోషన్ బాలకృష్ణ) అక్కడికక్కడే మరణించారు.

ఆధునిక వ్యవసాయంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న ఒక యువకుడు ఇలా అకాల మరణం చెందడం స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.

కొడగు జిల్లా మడికేరి సమీపంలోని హేరవనాడు గ్రామానికి చెందిన రోషన్ బాలకృష్ణ  గతంలో బెంగళూరులో ఐటీ (IT) రంగంలో మంచి ఉద్యోగం చేసేవారు. అయితే వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

తన సహోద్యోగితో కలిసి ఆధునిక వ్యవసాయ పరికరాలను పరిచయం చేస్తూ, మార్కెటింగ్ చేసే ఒక నూతన వ్యవసాయ విభాగాన్ని కూడా ప్రారంభించారు.

రోషన్ తన భార్య, కుమారుడితో కలిసి మైసూరు సమీపంలోని యలవాల వద్ద ఉన్న తమ సొంత వ్యవసాయ ఆస్తిని సందర్శించడానికి వచ్చారు. చేతికి వచ్చిన వరి పొలాన్ని చూసి, తోటలో మామిడి పండ్లను కోయడానికి రోషన్ వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భారీ పిడుగు పడింది.

దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలైనప్పటికీ, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

మృతుడు రోషన్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన హేరవనాడులో జరిగాయి. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన మైసూరు జిల్లా విపత్తు నిర్వహణ విభాగం.. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

ఇందులో రూ.4 లక్షలు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి, మిగిలిన రూ.1 లక్ష జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుండి అందజేయనున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions