Gandhi Bhavan Fight | కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్లో బుధవారం జరిగిన హైదరాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశం తీవ్ర రసాభాసగా మారింది.
ప్రోటోకాల్ విషయంలో నేతల మధ్య తలెత్తిన చిన్న వివాదం.. కాసేపట్లోనే భౌతిక దాడి మరియు తోపులాట వరకు వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
మంత్రులు పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ సమక్షంలోనే ఈ ఘటన జరగడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఈ హైడ్రామా నెట్టింట హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో.. అక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఘటనపై స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు.
వివాదానికి కారణం ఇదే..
హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజ్రీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల యుద్ధం కాస్తా ముదిరి, ఫిరోజ్ ఖాన్ను ఉస్మాన్ హజ్రీ వెనక్కు తోసేశారు. దీంతో ఫిరోజ్ ఖాన్ ఒక్కసారిగా కిందపడిపోయారు.
వీహెచ్కు తప్పిన ప్రమాదం..
ఈ ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సీనియర్ నేత వి.హనుమంతరావు (VH) ను సైతం తోసేయబోగా.. అక్కడున్న మిగతా నేతలు వెంటనే అప్రమత్తమై ఆయనను పక్కకు తప్పించారు.
అది కేవలం చిన్న అపార్థం మాత్రమే: మంత్రి
గాంధీభవన్లో జరిగిన ఈ రసాభాసపై మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా అక్కడ ఎలాంటి పెద్ద సంఘటన జరగలేదని ఆయన కొట్టిపారేశారు.
“ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజ్రీ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే గట్టి నాయకులు. వారి మధ్య జరిగింది కేవలం ఒక చిన్న అపార్థం మాత్రమే. ఆ గొడవ జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఇద్దరు నేతలు ఒకరితో ఒకరు మాట్లాడుకుని, కౌగిలించుకుని కలిసిపోయారు” అని మంత్రి తెలిపారు.
పార్టీ అంతర్గత విషయాలను కొందరు కావాలనే వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ అంశంపై విపక్షాలు గానీ, ఇతరులు గానీ అనవసరంగా రాద్ధాంతం చేయడం మానుకోవాలని పొన్నం ప్రభాకర్ గట్టిగా హితవు పలికారు.







