KCR speech Telangana Bhavan | తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
ప్రభుత్వం ధాన్యం కొనడంలో పూర్తిగా విఫలమైందని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ విమర్శించారు.
రాష్ట్రంలో పాలన అసలు సాగుతోందా లేదా అన్నట్లుగా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఇటీవల తెలంగాణ గురించి ఎంపీ తేజస్వీ సూర్య అనుచితంగా మాట్లాడినా, రాష్ట్రంలోని కాంగ్రెస్ మరియు బీజేపీ ఎంపీలు నోరు మెదపకపోవడంపై ఆయన మండిపడ్డారు.
అదే బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ విషయంలో రాజీ పడాలని సోనియా గాంధీ స్వయంగా చెప్పినా, తాను ఎప్పుడూ లొంగలేదని అది తన చిత్తశుద్ధికి నిదర్శనమని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజ్యసభలో సీఆర్ పాటిల్ మాట్లాడినప్పుడు, బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి బలంగా ఖండించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.






