Sai Pallavi clarification on old controversy | తన నాచురల్ యాక్టింగ్ తో ‘లేడీ పవర్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి తాజాగా ఒక పాత వివాదంపై స్పందించారు.
ప్రస్తుతం బాలీవుడ్ భారీ చిత్రం ‘రామాయణ’లో సీత పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె, గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు నాలుగేళ్ల క్రితం ఒక ప్రెస్ మీట్లో సాయి పల్లవిని ఒక రిపోర్టర్.. “మీరు మలయాళీ అయి ఉండి తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు?” అని ప్రశ్నించారు.
దానికి ఆమె.. “నేను తమిళ అమ్మాయిని (కోయంబత్తూరు), మలయాళీని కాదు” అని సమాధానమిచ్చారు. అయితే, రెండేళ్ల తర్వాత కొందరు దీనిని వక్రీకరించి, “మలయాళీ అని పిలిచినందుకు సాయి పల్లవికి కోపం వచ్చింది.. ఆమెకు ఆ భాష అంటే ఇష్టం లేదు” అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారు.
ఈ ప్రచారంపై ఆమె స్పందిస్తూ.. “ఆ హెడ్లైన్ చూసి నేను నిజంగా షాక్కు గురయ్యాను. నేను పుట్టి పెరిగింది కోయంబత్తూరులో, నా మాతృభాష తమిళం అని మాత్రమే నేను చెప్పాను. ఏ భాషను తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు, ఉండదు కూడా. నేను అనని మాటలను నాపై మోపడం నన్ను చాలా బాధించింది” అని వివరించారు.







