Rahul Gandhi On Kerala Story 2 | గత ఏడాది సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ (‘The Kerala Story)’ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ‘ది కేరళ స్టోరీ 2 (The Kerala Story 2) . అనేక చట్టపరమైన చిక్కులు, వివాదాల మధ్య గత వారం విడుదలైంది ఈ చిత్రం.
ఈ సినిమాపై పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం ఈ సినిమా తమ రాష్ట్రాన్ని తప్పుగా చూపిస్తోందని ఆరోపించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ చిత్రాన్ని తీవ్రంగా ఖండించారు.
కేరళ లౌకిక సంప్రదాయాలను కించపరిచేలా, ద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ఈ సీక్వెల్ ఉందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో తాజాగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సినిమాపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“ఈ సినిమా ఎవరూ చూడటం లేదు. థియేటర్లు ఖాళీగా ఉండటం శుభపరిణామం. దేశ ప్రజలకు కేరళ సంస్కృతి, సంప్రదాయాలపై స్పష్టమైన అవగాహన ఉందని ఇది నిరూపిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.
సినిమాను ఒక రాజకీయ ప్రచార సాధనంగా వాడుతున్నారని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేటి కాలంలో సినిమాలు, మీడియా సమాజాన్ని విభజించడానికి, ప్రజలను కించపరచడానికి ఆయుధాలుగా మారాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.










