Us Iran War | ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్న విషయం తెల్సిందే. అలాగే ప్రతీకారంగా ఇరాన్ సైతం విరుచుకుపడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియా రగులుతోంది.
ఇదే సమయంలో ఈ దాడుల కోసం అమెరికా చేస్తున్న ఖర్చు కూడా చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్పై భారీ దాడులు మొదలుపెట్టాయి.
ఇరాన్ నాయకత్వం, అణు కార్యక్రమం, మిసైల్ బేసులు, యుద్ధ నౌకలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ లక్ష్యంగా దాడులను మొదలుపెట్టాయి. తొలి 24 గంటల్లోనే అమెరికా సుమారు 779 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.7 వేల కోట్ల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో 200 టొమాహాక్ మిసైల్స్, F-35, F-22 యుద్ధ విమానాలు, క్యారియర్ సమూహాల నిర్వహణ ఖర్చు ఉన్నాయి. ఒక్క యుద్ధ నౌక నిర్వహణకే రోజుకు 15 మిలియన్ డాలర్లు ఖర్చవుతన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
దాడులకంటే ముందే అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, సైన్యాన్ని పశ్చిమాసియాలో మోహరించింది. ఇందుకోసం 630 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.5,700 కోట్లు ఖర్చు అయి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా-ఇజ్రాయెల్ చేపట్టిన మిస్సైల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఇతర ఉన్నత నాయకులు, సైనికాధికారులు చనిపోయారు. 11 ఇరాన్ నౌకలు నాశనమయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లో అమెరికా ఎంబసీలు, బేసులపై మిసైల్-డ్రోన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్, సౌదీ, బహ్రెయిన్పై కూడా దాడులు జరుగుతున్నాయి.
ప్రస్తుతం యుద్ధం నాలుగో రోజు కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ “లక్ష్యాలు సాధించే వరకు ఆపము. ఇంకా పెద్ద దాడులు రాబోతున్నాయి” అని హెచ్చరికలు జారీ చేశారు.









