Kavitha Demands SC Reservation Hike | రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, కుల గణనలో స్పష్టం అయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
సోమవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎస్సీ ఉప కులాల నాయకులతో ఆమె సమావేశం అయ్యారు. పెరిగిన ఎస్సీల జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని ఇందుకోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం తీర్మానం చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ అమలు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేపట్టే జనగణన పూర్తి అయి అధికారికంగా లెక్కలు ప్రకటించిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించిందని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా రిజర్వేషన్ ల పెంపునకు అసెంబ్లీ లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ ఉప కులాలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ ఉప కులాలతో కలిసి రిజర్వేషన్ల పెంపు సహా వారి సమస్యల పరిష్కారం కోసం జాగృతి ఉద్యమిస్తుందని తెలిపారు. ఎస్సీ ఉప కులాల్లో కొన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు.










