BR Naidu Viral Video | తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడుకి సంబంధించినవిగా పేర్కొంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ మహిళతో ఆయన ఉన్నట్లుగా ఉన్న వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ తరుణంలో వైరల్ గా మారిన వీడియోలపై బీఆర్ నాయుడు స్పందించారు. నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. AI సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
సదరు కంటెంట్ మొత్తం అసత్యమైనదని ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం అని వెల్లడించారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వైసీపీ కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్ర ను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.










