Bandla Ganesh Padayatra | సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (Bandla Ganesh) విజయసంకల్ప యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లోని గత ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు క్షేమంగా విడుదల కావాలని బండ్ల గణేశ్ తిరుమల శ్రీవారిని కోరుకున్నారట.
చంద్రబాబు జైలు నుంచి విడుదల అవడం, మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడంతో బండ్ల గణేశ్ శ్రీవారికి తన మొక్కు చెల్లించుకున్నారు. జనవరి 19న షాద్ నగర్ లోని తన నివాసం నుంచి తిరుమల వరకు బండ్ల గణేశ్ విజయసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు.
23 రోజుల్లో దాదాపు 500 కిలోమీటర్లకు పైగా ఆయన పాదయాత్ర కొనసాగింది. సోమవారం ఆయన తిరుపతికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి వద్ద రాత్రి ఆయన బస చేశారు.
ఈ ఉదయం అలిపిరి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి ఆయన కొండపైకి నడకమార్గంలో బయల్దేరారు. తిరుమల కొండపైకి చేరుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బండ్ల గణేశ్ మాట్లాడుతూ జైలు నుంచి చంద్రబాబు క్షేమంగా విడుదల కావాలని స్వామివారిని కోరుకున్నానని… తన కోరిక నెరవేరడంతో శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నానని చెప్పారు.










