Deputy Cm Pawan Kalyan News | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టుకు చెందిన చట్టా సతీశ్ అనే యువకుడు దీక్ష పట్టారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంలోకి వచ్చే వరకు చెప్పులు వేసుకోనని దీక్ష పూనారు. పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేశాకే చెప్పులు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మంగళగిరిలో పవన్ ను కలిశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
‘పవన్ కల్యాణ్ గారంటే తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టుకు చెందిన చట్టా సతీష్ అనే యువకుడికి ఎనలేని అభిమానం. ప్రజారాజ్యం సమయంలో పార్టీ యూత్ వింగ్ యువ రాజ్యం సభ్యుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం లాంటి సప్త సిద్ధాంతాలు రూపొందించి పార్టీని నిర్మించిన పవన్ కళ్యాణ్ గెలవాలని సతీష్ దీక్షపట్టారు. 2024 జనవరి 22న, అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున సతీష్ ఒక నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచి, ప్రభుత్వంలోకి వచ్చే వరకూ చెప్పులు వేసుకోను అని దీక్ష పూనారు. పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని తెలియచేశాకనే చెప్పులు వేసుకోవాలనుకున్నారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, జనసేన 100శాతం స్ట్రయిక్ రేట్ సాధించడం సతీష్ కు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అయితే అప్పటి నుంచి కలవలేదు. బుధవారం సాయంత్రం మంగళగిరి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. కొండగట్టు ప్రాంతంలోనే ఉంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగాలను ఎప్పటికప్పుడు ఫాలో కావడం, గతంలో కొండగట్టుకు వచ్చినప్పుడు కలిసిన సందర్భాన్ని గుర్తు చేశారు. కేవలం అభిమానమే కాకుండా, పార్టీ సిద్ధాంతాలు ఎంతగానో ఆలోచింపచేశాయి అన్నారు. ఈ సందర్భంగా కొండగట్టు క్షత్రంలో భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన గురించి వినతి పత్రం ఇచ్చారు. సతీష్ అభిమానానికి ముగ్ధులైన పవన్ కళ్యాణ్ ఆయనకు జ్ఞాపికను అందచేశారు’ అని జనసేన పార్టీ పేర్కొంది.










