Ys Jagan News | హలో ఇండియా ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూడండి అంటూ విజ్ఞప్తి చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి అని పేర్కొన్నారు. ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా చవక లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమే అని ఆవేదన వ్యక్తం చేశారు.
అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటా వరకూ… ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇది అని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో ఉచిత పంట బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, పెట్టుబడి సహాయం కింద చేసిన హామీలు.. ఇవన్నీకూడా మోసాలేనని నిర్ధారణ అయ్యిందని కూటమి సర్కారుపై ఫైర్ అయ్యారు.
తమ పాలనలో, టన్ను అరటికి సగటున రూ. 25,000 ధర లభించిందని రేట్లు తగ్గిపోయిన పక్షంలో రైతులు నష్టపోకుండా ప్రత్యేక రైళ్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు నడిపించినట్లు తెలిపారు. కానీ నేడు, వ్యవసాయం కూలిపోతుంటే… రైతులు నష్టాల్లో మునిగిపోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చోద్యం చూస్తున్నారని కన్నెర్ర చేశారు. కిలో ఆహారం 50 పైసలైతే ఆ ఆహారాన్ని పండించే రైతుల శ్రమకు కట్టే విలువ ఎంత? అని ప్రశ్నించారు.









