Deputy Cm Pawan Kalyan | అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నీట మునిగిన పొలాల్లోకి స్వయంగా దిగి నష్ట తీవ్రతను రైతుల నుండి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎంపీ, MLA ల నుండి తెలుసుకున్నారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుందని, నష్ట తీవ్రతపై ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత పులిగడ్డ వద్ద రోడ్ సైడ్ కూరగాయలు, కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకునే వారిని, ప్రజలను కలిశారు. తుపాను ప్రభావం గురించీ, వారి కుటుంబ పరిస్థితి గురించి ఆరా తీశారు. గొర్రె నాగసూరి అనే మహిళ.. భర్తను కోల్పోయాక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.
పెద్ద వెంకటేశ్వరరావు అనే వృద్దుడికి చెందిన దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి, ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బొర్రా రాము అనే ఆటో డ్రైవర్ ను పలుకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.









