Chandrababu on Google’s $15 Billion Data Center in Vizag | ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో దిగ్గజ సంస్థ గూగుల్ అడుగుపెట్టనుంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ‘భారత్ ఏఐ శక్తి’ కార్యక్రమంలో గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మల సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మరియు గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
విశాఖను ఏఐ సిటీగా మార్చేందుకు ఇది పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు, గూగుల్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో భాగంగా విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
ఈ పెట్టుబడి రావడంతో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. అలాగే విశాఖకు గూగుల్ రావడంలో లోకేశ్ పాత్ర ప్రధానం అని అభినందించారు. నాడు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను నేడు విశాఖకు గూగుల్ ను తీసుకువచ్చామని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.










